The situation is still terrifying In the city of Derna in Libya. – లిబియాలోని డెర్నా నగరంలో ఇప్పటికీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో లిబియాలోని డెర్నా నగరంలో ఇప్పటికీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎటుచూసినా బురద మేటలు కనిపిస్తున్నాయి. వాటి కింద శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. మరోవైపు సముద్ర జలాల నుంచి వందల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. గురువారం నాటికి ఈ నగరంలో 11,300 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన మరో 10,100 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. వారంతా మరణించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య 20 వేలకు పైనే ఉండొచ్చని అధికారులు ఇప్పటికే అనధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతదేహాలు, గల్లంతైనవారి కోసం అన్వేషించేందుకు వీలుగా అధికారులు శుక్రవారం డెర్నా నగరాన్ని మూసివేశారు. ప్రజలను బయటకు తరలించి సహాయక బృందాలు బురద మేటలను త్వరితగతిన తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ధ్వంసమైన ఇళ్ల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు.
డెర్నాలో ఇప్పటికే మృతుల సంఖ్య భారీ సంఖ్యలో ఉండగా, అధికారులను మరో ఆందోళనకర అంశం కలవరపాటుకు గురిచేస్తోంది. 2011 నుంచి అంతర్గత ఘర్షణలు కొనసాగుతున్న లిబియాలో పెద్ద ఎత్తున మందుపాతరలు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలుడు పదార్థాలు కూడా లిబియాలో ఉన్నట్లు సమాచారం. ఇవి వరద నీటిలో కొట్టుకొని ఉండొచ్చని, సహాయక చర్యలు చేపట్టేటప్పుడు అవి పేలితే ప్రాణ నష్టం మరింత పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.