Rajkot: గేమ్జోన్లో ఘోరం

వేసవి సెలవులు…అందులోనూ వారాంతం… సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు.
రాజ్కోట్: వేసవి సెలవులు…అందులోనూ వారాంతం… సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయానికి 27 మృత దేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘోర ఘటన గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులూ ఉన్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి తెలిపారు. భారీ మంటలు ఎగసినందు వల్లే టీఆర్పీ గేమ్జోన్ కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని వెల్లడించారు.
ఆ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. టీఆర్పీ గేమ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తిపేరు మీద ఉందని రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతోందన్నారు. నగరంలోని ఇతర గేమ్జోన్లను మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. గేమ్జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్జైన్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబళించిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన ఒక్కొకరికి రూ.50వేలు అందిస్తామన్నారు.
రాష్ట్రపతి విచారం
రాజ్కోట్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గేమ్జోన్లోని భద్రత ఏర్పాట్లపై ఆడిట్ నిర్వహించాలని ముంబయి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వర్ష గైక్వాడ్ డిమాండ్ చేశారు. చిన్నారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.