China: China has not changed its mind.. బుద్ధి మార్చుకోని చైనా.. అరుణాచల్లో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు

China: పొరుగుదేశం చైనా తన బుద్ధి మార్చుకోలేదు. మన భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్లో మరో 30 ప్రాంతాలకు డ్రాగన్ కొత్త పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) తమదేనంటూ వితండవాదం చేస్తున్న డ్రాగన్.. మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేసినట్లు ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కథనం వెల్లడించింది.
అరుణాచల్లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సదరు కథనం పేర్కొంది. ఆ పేర్లు ఏంటనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. చైనీస్ క్యారెక్టర్లు, టిబెటన్, పిన్యిన్ భాషల్లో వీటిని పెట్టినట్లు సమాచారం. చైనా క్యాబినెట్ నిర్ణయం మేరకు ‘జాంగ్నన్లోని భూభాగాల’ పేరుతో కొత్త జాబితాను ఆ దేశం విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి కొత్త పేర్లు అమల్లోకి రానున్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తున్న చైనా.. ఆ ప్రాంతాన్ని ‘జాంగ్నన్’ అని పిలుస్తోంది. అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ ఇలా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017లో తొలిసారిగా ఆ రాష్ట్రంలో 6 ప్రాంతాలకు చైనీస్ పేర్లను విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు రెండోసారి పేర్లు పెట్టింది. ఇక, గతేడాది ఏప్రిల్లో 11 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, రోమన్ అక్షరాలతో కూడిన పిన్యిన్ భాషల్లో అధికారిక పేర్లను ఖరారు చేసింది.
చైనా తీరును గతంలోనే భారత్ పలుమార్లు ఖండించింది. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆ రాష్ట్రంలో మోదీ పర్యటనను బీజింగ్ ఖండించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా న్యూదిల్లీ గట్టిగా బదులిచ్చింది.