What happened in Goa.. Where is the mayor’s daughter? గోవాలో ఏం జరిగింది.. మేయర్ కుమార్తె ఎక్కడ?

నేపాల్కు చెందిన ఓ మహిళ భారత్లోని గోవాలో అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ఆదివారం తెలియజేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నేపాల్లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్ కుమార్తె అయిన ఆర్తీ హామల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్ మీడియా పేర్కొంది.
ఆర్తీ స్నేహితురాలు ఆమె తండ్రికి అదృశ్యం విషయం తెలియజేయగా ఆయన సోషల్ మీడియా వేదికగా తమ కూతురి ఆచూకీ తెలియజేయాలని కోరుతున్నారు. ‘ఆర్తీ నా పెద్ద కూతురు. ఆమె ఓషో ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. గోవా ఉండేవారు నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా.’అని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.
అదేవిధంగా తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయల్దేరారని తెలిపారు. తన కూతురును వెతకటంలో సాయం అందించాలని ఆచూకీ తెలియటంతో తమను సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను జత చేశారు. మరోవైపు మహిళా అదృశ్యం ఫిర్యాదు అందటంతో గోవా పోలీసులు ఆర్తీ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.