Mukhtar Ansari Funeral : గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. పరారీలో భార్య! జైల్లో పెద్ద కుమారుడు

ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ (63) గుండెపోటుతో గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శనివారం (మార్చి 30) యూపీలోని గాజీపూర్లో ముగిశాయి. యూసుఫ్పూర్ మహ్మదాబాద్లోని కాలీబాగ్ శ్మశానవాటికలో ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులు సమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియల ఊరేగింపులో భారీ సంఖ్యలో జనం..
లక్నో, మార్చి 31: ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ (63) గుండెపోటుతో గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శనివారం (మార్చి 30) యూపీలోని గాజీపూర్లో ముగిశాయి. యూసుఫ్పూర్ మహ్మదాబాద్లోని కాలీబాగ్ శ్మశానవాటికలో ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులు సమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియల ఊరేగింపులో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. వేలాది మంది ఆయన మద్ధతు దారులు నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు సిబ్బందితోపాటు ప్రాంతీయ సాయుధ కాన్స్టాబులరీ, పారామిలటరీ బలగాలు అన్ని కీలక ప్రదేశాలలో మోహరించారు.
జనం పోటెత్తడంతో మరింత మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో మోహరించారు. అంత్యక్రియల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు మద్ధతుదారులు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఊరేగిపంఉ సమయంలో అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఊరేగింపులో ఉన్న కొందరు వ్యక్తులు నినాదాలు చేశారు. ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని పదేపదే ప్రకటించినప్పటికీ నినాదాలు చేశారని, వారందరినీ వీడియో ద్వారా చిత్రీకరించామని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి ఒంటి గంటకు బండా నుంచి ముఖ్తార్ అన్సారీ భౌతికకాయం ఆయన తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చారు. ప్రజలు నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో శనివారం ఉదయం వరకు తోపులాట జరిగింది. భద్రత దృష్ట్యా ఇంటి ప్రధాన ద్వారం నుంచి ముఖ్తార్ మద్దతుదారుల ప్రవేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఇంటి గోడలు దూకి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ముఖ్తార్ ఇంటితో పాటు కాలీబాగ్ స్మశానవాటికకు వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలు మోహరించారు. ముఖ్తార్ పూర్వీకుల నివాసం నుంచి ప్రారంభమైన అంత్యక్రియల ఊరేగింపులో ఆయన సోదరుడు అఫ్జల్ అన్సారీ, కుమారుడు ఒమర్ అన్సారీ, మేనల్లుడు సుహైబ్ అన్సారీ, ఎమ్మెల్యేలతోపాటు పలువురు కుటుంబ సభ్యులు, మద్దతుదారులు పాల్గొన్నారు.