London Heathrow Airport: యూకేలోని హీత్రూ ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి.


ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిక్రాఫ్ట్ను తాకింది.
ఈ ఘటనలో రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. ‘‘మా ఎయిర్క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజినీర్లు అంచనావేస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని బ్రిటీష్ ఎయిర్వేస్ పేర్కొంది.

‘కేథలిన్’తో విమానాల అవస్థలు..
యూకేలో కేథలిన్ తుపాను దెబ్బకు ఈ ఎయిర్ పోర్టులో విమానాలు ల్యాండ్ కావడానికి అవస్థలు పడుతున్నాయి. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ వరకు వచ్చి.. బ్యాలెన్స్ సాధ్యం కాకపోవడంతో తిరిగి గాల్లోకి ఎగరాల్సి వచ్చింది. దాదాపు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. యూకేలో 140 విమాన సర్వీసులు రద్దు చేశారు. వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు స్కాట్లాండ్లోని రైలు నెట్వర్క్పై కూడా దీని ప్రభావం పడింది. యార్క్ సిటీలో వరదలు వచ్చాయి. థేమ్స్ నదిపై ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి