#Telangan Politics

బీఆర్‌ఎస్‌కు కోనప్ప గుడ్‌బై..! సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటితో భేటీ

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ నేత, సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్‌లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

రాబోయే పార్లమెంట్‌  ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్‌  మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సిర్పూర్‌ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప  పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ  సిర్పూర్‌ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి  విజయం సాధించారు.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *