భూకబ్జా రెడ్డిగా మారిన చెవిరెడ్డి: అచ్చెన్నాయుడు

ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
అమరావతి: ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసి అర్ధరాత్రి వెళ్లి జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేస్తారా? అని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి భూకబ్జా రెడ్డిగా మారిపోయారని దుయ్యబట్టారు.
‘‘హాథీరాంజీ మఠం స్థలంలో 30 ఎకరాలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించారు. 2.50 ఎకరాల్లో తన భార్య పేరుతో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. పేదల స్థలాల లాక్కునేందుకే ఎమ్మెల్యే ఈ దారుణానికి ఒడిగట్టారు. పేదల ఇళ్లు కూల్చిన అధికారులకు ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బంధువుల ఇళ్లు కనపడలేదా? వాటిని ఎందుకు కూల్చలేదు? కూల్చిన ఇళ్లను తిరిగి నిర్మించి పేదలకే ఇవ్వాలి’’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.