Vande Bharat : లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది

లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్లోని ఉదయ్పుర్ నుంచి జైపుర్కు సోమవారం ఉదయం 7.50 గంటలకు వందే భారత్ రైలు బయలుదేరింది. ఉదయం 9.55 గంటల సమయంలో రైలు భిల్వాడా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైల్వే ట్రాక్పై రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. దీంతో వందల మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్లు కిందకు దిగి రైలు పట్టాలను పరీక్షించగా.. రాళ్లతోపాటు కొన్నిచోట్ల రాళ్లు కదలకుండా ఇనుపరాడ్లు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.