Manipur – కొంతకాలంగా కనిపించని ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ (Internet Services) సేవలపై విధించిన ఆంక్షలను గతవారం మణిపుర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఫొటోలు వైరల్ (Viral Photos) అవుతున్నాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటన మరోసారి దుమారం రేపింది.
ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు తెలిపింది. జులై 6 నుంచి వీరిద్దరూ అదృశ్యమయ్యారు.
జులై 6వ తేదీన ఆంక్షలు సడలించడంతో అమ్మాయి నీట్ కోచింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్పై లాంగ్ డ్రైవ్కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సాయుధులు వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
కాగా.. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపుర్ ప్రభుత్వం తమ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మణిపుర్ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఆ మధ్య మణిపుర్లో ఇంటర్నెట్ ఆంక్షలను సడలించినప్పుడు కూడా ఇద్దరు మహిళలపై జరిగిన అమానుషం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. వీటితో పాటు అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న మరో 9 హింసాత్మక ఘటనలను సీబీఐ విచారిస్తోంది.