Women’s Bill – మహిళల హక్కుల బిల్లు గేమ్ ఛేంజర్

మహిళా రిజర్వేషన్ బిల్లు లింగ న్యాయం కోసం మన కాలంలో వచ్చిన అత్యంత పరివర్తనాత్మక విప్లవమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం వ్యాఖ్యానించారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆసియా పసిఫిక్ జాతీయ మానవ హక్కుల సంస్థ (ఎన్హెచ్ఆర్ఐఎస్)ల ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. మరింత సంతోషకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రాల శాసనసభలు, జాతీయ పార్లమెంటులోనూ అదేవిధమైన రిజర్వేషన్ కల్పనకు ప్రయత్నం సాగుతోంది. ఇది లింగ న్యాయానికి మన కాలంలో వచ్చిన పరివర్తనాత్మక విప్లవం’’ అని ముర్ము పేర్కొన్నారు.
మానవ హక్కుల సమస్యను విడిగా చూడొద్దని, దాంతోబాటు సహజ పర్యావరణ పరిరక్షణపై సమాన శ్రద్ధ చూపాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. మానవ చర్యల కారణంగా ప్రకృతి తీవ్రంగా గాయపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.