Nepal – భారీ భూకంపం..

నేపాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
6.4 తీవ్రతతో భూకంపం
శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. జజర్కోట్లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్కోట్లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు రాజధాని కాఠ్మాండూలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ సంతాపం ప్రకటించారు. నేపాల్లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9వేల మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే.