Manipur Violence-ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్ల డిమాండ్కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది….

జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్(Manipur)లో ఇంకా పూర్తిగా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 175 మంది మృతి చెందారని రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది. 33 మంది అదృశ్యమయ్యారని, 1,118 మంది గాయపడ్డారని తెలిపింది. చనిపోయిన 175 మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. (Manipur Violence)
మే 3న తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్ల డిమాండ్కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది. కొన్నినెలలపాటు అది కొనసాగింది. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. 5,172 నిప్పటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు 4,786 ఇళ్లు, 386 ప్రార్థనా మందిరాలకు నిప్పు అంటించారు. రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668 ఆయుధాలను లూటీ చేశారు. వాటిల్లో 1,329 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక భద్రతా బలగాలు 360 బంకర్లను ధ్వంసం చేశారు. మైదాన, పర్వత ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను గురువారం తొలగించారు.