IIT Bombay : వెజ్ – నాన్వెజ్ వివాదం

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం తలెత్తిన వెజ్ – నాన్వెజ్ వివాదాన్ని అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. వసతిగృహంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇన్స్టిట్యూట్ మెస్ కౌన్సిల్ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. అక్టోబరు 1న సమావేశమైన మెస్ కౌన్సిల్ శాకాహార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఆ టేబుళ్లపై వెజ్ భోజనం మాత్రమే చేయాలని విద్యార్థులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసింది. గత జులైలో ఈ వివాదం రాజుకుంది. వసతిగృహం క్యాంటీన్లో మాంసాహారం తిన్నందుకు ఓ విద్యార్థిని కొందరు విద్యార్థులు అవమానించారు. క్యాంటీన్ గోడలపై ‘వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోడానికి అర్హులు’ అని రాసిన పోస్టర్లను అతికించి, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్లో వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు.