#Medchal-Malkajgiri

Mynampally: నన్ను ఇబ్బంది పెడితే నేనూ ఇబ్బంది పెడతా: ఎమ్మెల్యే మైనంపల్లి

భారాస టికెట్ల కేటాయింపుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోసారి స్పందించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు.

భారాస టికెట్ల కేటాయింపుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోసారి స్పందించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. తిరుమలలో మరోసారి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు. 

‘‘నాకు నా కుమారుడే ముఖ్యం. జీవితంలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెడితే కచ్చితంగా నేనూ ఇబ్బంది పెడతాను. మెదక్‌, మల్కాజిగిరి కార్యకర్తలే నాకు ప్రాధాన్యం. నేను ఏ పార్టీనీ విమర్శించను. పార్టీలకు అతీతంగా ఉంటా. మా అబ్బాయికి టికెట్‌ ఇస్తే.. గెలిపించుకుని వస్తా’’ అని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. 

తనకు మల్కాజిగిరితో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్‌ టికెట్‌ ఇస్తేనే భారాస తరఫున పోటీ చేస్తానని.. లేకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని సోమవారం  మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే  హరీశ్‌పై పోటీ చేస్తానని పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో తన కుమారుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజాసేవ చేశాడన్నారు. 

అయితే మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్‌ ఖరారు చేసిన భారాస.. మెదక్‌ టికెట్‌ను మాత్రం ఆయన కుమారుడికి ఇవ్వలేదు. అక్కడ మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డికి టికెట్‌ను కేటాయించింది. మరోవైపు హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మైనంపల్లి స్పందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *