Paralysis – ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి…

పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ‘ద లాన్సెట్’ అంచనావేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనికోసం ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 2020లో పక్షవాతంతో చనిపోయినవారి సంఖ్య 66 లక్షలుగా ఉందని తెలిపింది.
గత 30 ఏళ్లలో పక్షవాతంతో మరణించే, వైకల్యం బారినపడే వ్యక్తుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఈ నివేదికలో వివరించింది. 2020లో పక్షవాత మరణాలు అత్యధికంగా ఆసియాలో 61 శాతం ఉండగా.. 2050 నాటికి 69 శాతానికి పెరుగుతాయని చెప్పింది. వీటిని తగ్గించడానికి పలు సూచనలు చేసింది. ఈ మరణాల నివారణకు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని చెప్పింది. ఇందుకోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపింది. ఈ మరణాలను ఎదుర్కోవడానికి సరిపడా వైద్య సిబ్బంది, మందులు, మౌలిక సదుపాయాలను పెంచాలని స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే పక్షవాత బాధితుల్లో అకాల మరణాలను తగ్గించొచ్చని చెప్పింది.