Flight Fares Got Increased – విమాన ఛార్జీలు పెరిగాయి

భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి టొరంటో విమాన టికెట్ బుకింగ్స్కు చివరి నిమిషంలో డిమాండ్ పెరిగిందని వెల్లడించాయి.
భారత్-కెనడాల మధ్య ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడాలు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నాయి. వారానికి 48 విమానాలు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు దిల్లీ-టొరంటో, దిల్లీ-వాంకోవర్ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక ఎయిర్ కెనడా దిల్లీ-టొరంటో మధ్య ప్రతి రోజూ విమాన సర్వీసులను నడుపుతోంది. దాంతోపాటు వారంలో మూడు విమాన సర్వీసులను దిల్లీ-మాంట్రియల్ మధ్య నిర్వహిస్తోంది.
ట్రూడోకు షాక్.. పాపులారిటీలో ప్రతిపక్షనేత ముందజ
అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ మార్కెట్లో భారత్-కెనడా వాటా 1.2 శాతం కాగా, కెనడా విమాన రవాణాలో భారత్ నాలుగో అతిపెద్ద దేశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 6,78,614 మంది ప్రయాణించారు. తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దిల్లీ-టొరంటో విమాన టికెట్ ధరల గురించి విచారించే వారి సంఖ్య పెరిగిందని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి.