TDP Chandrababu: రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబుChandrababu:

రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్, జ్యోతిబా ఫులే వంటి మహనీయుల స్ఫూర్తితో 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తెదేపా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇక ముందూ ఇదే అంకితభావంతో బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా అని పేర్కొన్నారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు.
కదిరిలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన తెదేపా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, నేతలకు తినిపించారు.

ఉండవల్లిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు రవినాయుడు, జస్వంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.