Election Results 2024: ECI Prepares For Vote Counting All About June 4 :ఓట్ల కౌంటింగ్కు.. కౌంట్డౌన్ షురూ..

ఏపీలో కౌంటింగ్కు కౌంట్డౌన్ షురూ చేసింది ఎన్నికల సంఘం. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో ఏమాత్రం అలజడి, ఆందోళనకి తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలపై ఎన్నింటికి క్లారిటీ రానుంది. ఫస్ట్ ఫలితం వచ్చేదెప్పుడు.?
ఏపీలో కౌంటింగ్కు కౌంట్డౌన్ షురూ చేసింది ఎన్నికల సంఘం. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో ఏమాత్రం అలజడి, ఆందోళనకి తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలపై ఎన్నింటికి క్లారిటీ రానుంది. ఫస్ట్ ఫలితం వచ్చేదెప్పుడు.?. ఏ పార్టీ పవర్లోకి వస్తుందనేది ఎప్పుడు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఇదే డిస్కషన్. ఇంతకీ ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు. తుది ఫలితాలు ఎప్పుడొస్తాయనే చర్చ మొదలైంది.
ఏపీలో జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వివరించారు. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 111చోట్ల 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగితా మూడు చోట్ల 25 రౌండ్లకుపైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2గంటల లోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4లోపు, మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరింటిలోపు ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకై టేబుళ్లను సంఖ్య పెంచబోతున్నట్టు ఈసీ తెలిపింది. రాత్రి 8–9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ప్రిపేర్ చేసినట్టు సీఈవో మీనా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అలర్ట్ చేసినట్టు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ శంకబ్రత బాగ్చి వివరించారు.
ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్)లో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే, మరో వైపు వాటితోపాటు ఉదయం 8.30గం.లకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి11 గంటల వరకు ఫలితాలపై కొంత స్పష్టత కానుంది. మధ్యాహ్నం 2 – 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించకూడదని ఈసీ నిర్ణయించింది. మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తిచేసింది.
మరోవైపు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటించాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి , 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో ECI కి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవలను వినియోగించుకునే అంశంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ ఇదే..!
- ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే సిబ్బంది ఉదయం 4 గంటల కల్లా కౌటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.
- కౌటింగ్ సిబ్బంది ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో ఉదయం 5 గంటలకు అధికారులు నిర్ణయిస్తారు.
- తమకు కేటాయించిన టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బంతి చేత అయా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు.
- నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభించి, ర్యాండమైజేషన్ ద్వారా మూడు దశల్లో కౌంటింగ్ చేపడతారు.
- ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూంలను తెరుస్తారు. అనంతరం ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు.
- తొలు ఈటీపీబీఎస్లో వచ్చిన సర్వీసు ఓట్లను, పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలట్ పత్రాలను ఒక కట్టగా కడతారు.
- ఒక్కో కౌంటింగ్ టేబుల్కు ఒక రౌండ్కు గరిష్ఠంగా 20 కట్టలు కేటాయిస్తారు.
- పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు పూర్తికాకుండా… కంట్రోల్ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించడానికి వీలులేదు.
- ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
లెక్కింపు సాగేది ఇలా..
- ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు.
- పోలింగ్ కేంద్రాల సీరియల్ నంబర్ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. వాటన్నింటి లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తి.
- పోలింగ్ కేంద్రం సీరియల్ సంఖ్యకు అనుబంధంగా ఏ, బీ, సీ వంటి బై నెంబర్లు ఉంటే.. వాటిని విడిగా కౌంటింగ్ చేస్తారు.
- ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని పక్కనపెట్టి మరో ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
- ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక.. మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ చీటీలను లెక్కిస్తారు.
- ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్ లెక్కింపు మొత్తం పూర్తై, వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు.
- నియోజకవర్గం పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి.. లాటరీ విధానంలో అయిదు కార్డులు తీస్తారు.
- మొరాయించిన ఈవీఎంల పోలింగ్ కేంద్రాలను, మాక్ పోల్ వీవీ ప్యాట్ చీటీలను తొలగించని పోలింగ్ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు.
- లాటరీ విధానంలో ఎంపికచేసిన ఐదు కేంద్రాల వీవీ ప్యాట్లను బయటకు తీస్తారు.
- ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు.
- అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్ చీటీల్లోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు.
- వీవీ ప్యాట్ చీటీల లెక్కింపును రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సొంతంగా నిర్వహిస్తారు.
- వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు.
అలాగే, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని సూచించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించనున్నారు. ఎన్నికల అనంతర హింస జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. కౌంటింగ్ డే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలుతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.