YS Sharmila: జగన్ ‘విశాఖ విజన్’ ప్రకటనపై షర్మిల సెటైర్లు.

అమరావతి: ‘విశాఖ విజన్’ పేరుతో సీఎం జగన్ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
‘‘పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైకాపా విజన్’’ అని షర్మిల వ్యంగ్యంగా పేర్కొన్నారు.