Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపారు.
హైదరాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాల్లో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీరిలో వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులు ఉన్నారని చెప్పారు. వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్ల అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 3 నెలల పెండింగ్ జీతంతో పాటు, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు.