China Robo Dogs Wih Gun : శునకంపై ఓ ఆటోమేటిక్ రైఫిల్

చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మర శునకంపై ఓ ఆటోమేటిక్ రైఫిల్ను అమర్చారు. లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వరంగ మీడియా సంస్థ సీసీటీవీ ప్రసారం చేసింది. ‘‘మా పట్టణ యుద్ధ తంత్రంలో సరికొత్త సభ్యుడు వచ్చాడు. గస్తీ, శత్రువును గుర్తించడం, లక్ష్యంపై దాడి చేయడానికి మనుషుల స్థానంలో ఇది రానుంది’’ అని ఆ వీడియోలో వెల్లడించారు. కంబోడియాలో నిర్వహించిన ‘గోల్డెన్ డ్రాగన్-2024’ యుద్ధ విన్యాసాల సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో డ్రోన్ తుపాకులను కూడా చైనా సైన్యం ప్రదర్శించింది. వాస్తవానికి గతేడాది నవంబరులో కూడా చైనా, కంబోడియా, వియత్నాం పాల్గొన్న సంయుక్త సైనిక విన్యాసాల్లో ఇవి కనిపించాయి. ఈ మర శునకాలు బ్యాటరీపై ఆధారపడి రెండు నుంచి నాలుగు గంటలపాటు పనిచేస్తాయి. ముందుకు వెనక్కు నడవడం, పడుకోవడం, దూకడం వంటివి చేయగలవు. దీనిలోని మ్యాప్ల ఆధారంగా మార్గనిర్దేశం చేసుకొని లక్ష్యం వైపు ప్రయాణిస్తాయి. మార్గమధ్యలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించగలవు. వీటిని డ్రోన్ల సాయంతో మోహరించే అవకాశం ఉంది. ఈ రోబో శునకం బరువు 15 కిలోలు ఉంటుంది. దీనిలో ఇన్బిల్ట్ సెన్సర్లు ఉంటాయి. 4డీ వైడ్ యాంగిల్ పర్సిప్షన్ సిస్టమ్ను అమర్చారు. సైనికులతో సమానంగా ఇది యుద్ధ విన్యాసాలు చేయగలదు. చైనాకు చెందిన యూనీట్రీ సంస్థ ఈ మర శునకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. వీటి ఖరీదు మోడల్ను బట్టి రూ.2.3 లక్షల నుంచి రూ.83.36 లక్షల వరకు ఉంది.