United Nations: నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!

UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఐరాస: భారత్ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటంతో భారత్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఓ విలేకరి ప్రస్తావించగా.. డుజారిక్ పైవిధంగా స్పందించారు.
కేజ్రీవాల్ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా సైతం స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారాన్నీ అగ్రరాజ్యం ప్రస్తావించింది. దీనిపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని దీటుగానే బదులిచ్చింది. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చి చెప్పింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇక్కడి చట్టాల ప్రకారమే నడుచుకుంటాయని పేర్కొంది. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఐరాస స్పందించడం గమనార్హం.