Vande Bharat: వందేభారత్ @ 50.. సికింద్రాబాద్-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు

Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు.
దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మంగళవారం పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందేభారత్లను ప్రధాని నేడు వర్చువల్గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు. ఏలూరు రైల్వేస్టేషన్ ఆవరణలోని గూడ్స్షెడ్డు నిర్మాణానికి మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
51కి చేరిన వందేభారత్లు..
సికింద్రాబాద్-విశాఖ, కలబురగి-బెంగళూరుతో పాటు లఖ్నవూ-దేహ్రాదూన్, పట్నా-లఖ్నవూ, న్యూ జల్పాయ్గుడి-పట్నా, పూరి-విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజురహో-దిల్లీ, అహ్మదాబాద్-ముంబయి, మైసూరు-చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రధాని నేడు ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందేభారత్ల సంఖ్య 51కి చేరంది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా దిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పది వందేభారత్లు అందుబాటులో ఉన్నాయి.