Manipur : మరో దారుణం..

మణిపుర్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో ఓ వ్యక్తి శరీరం కాలిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా వ్యాప్తిలో ఉన్నాయి. మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన రోజే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఏడు సెకన్ల నిడివి ఉన్న తాజా వీడియోలో నల్ల టీషర్టు, ప్యాంటు ధరించిన వ్యక్తి దేహం మంటల్లో కాలిపోతోంది. అప్పటికే అతను చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుడిని గుర్తించామని, కాలిన దేహాన్ని ఆసుపత్రిలో ఉంచామని భద్రతా సలహాదారు కులదీప్ సింగ్ తెలిపారు. బాధితుడు కాంగ్పోక్పి జిల్లాకు చెందిన వాడని చెప్పారు. ఆ ఘటన ఎక్కడ జరిగిందీ వెల్లడించలేదు. హత్యోదంతాన్ని దేశీయ గిరిజన నేతల వేదిక(ఐటీఎల్ఎఫ్) సోమవారం ఖండించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన దృశ్యంపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.